నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల పరాజయం జగన్ వర్గాన్ని ఆలోచనలో పడేసింది.ఏపీలో రోజు రోజుకు వైసీపీ పరిస్థితి దిగజారుతుండడంతో ఆ పార్టీ నాయకులు జగన్ను నమ్ముకుని రాజకీయం చేయడం కంటే అధికార టీడీపీలోకి జంప్ చేసేయడం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టే కనపడుతోంది.
అయితే ఇప్పటికే టీడీపీలో లోడ్ ఓవర్ అయ్యింది.
ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన సంగతి తెలిసిందే.
మరికొందరు అదే బాటలో వెళతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు చూసిన చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో పాటు తమకు పరిచయం ఉన్న మంత్రులతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఇటు టీడీపీ మంత్రులతో పాటు అటు వైసీపీలోని కొందరు కూడా ధృవీకరిస్తుండడం విశేషం.
ఈ క్రమంలోనే చాలా కీలకమైన పేర్లు కూడా జంపింగ్ లిస్టులో వినిపిస్తున్నాయి.
జగన్కు అత్యంత సన్నిహితుడు అయిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, జగన్ మామ బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్లతో పాటు ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న తండ్రికొడుకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు అయిన రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి పెద్దరెడ్డికి జిల్లాలో బలమైన అనుచర గణం ఉంది.పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆయన అనుచరులే కావడం విశేషం.
ఇప్పుడు ఆయన పార్టీ మారితే ఈ తండ్రికొడుకులతో పాటు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం కండువాలు మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.వీరంతా పార్టీ మారిపోతే చంద్రబాబు సొంత జిల్లాలో వైసీపీ పునాదులు కూలినట్టే అవుతుంది.